Health Minister | వైద్య సేవలపై మంత్రి దామోదర్ దిశానిర్దేశం

హాజ‌రైన సూపరింటెండెంట్లు
100 పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సేవల నాణ్యత పెంపుపై సమీక్ష
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులతో మంత్రి చర్చ
హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

Health Minister | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవల నాణ్యత మెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ సమావేశం జరిగింది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 47 ఆసుపత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలోని 40 ఏరియా ఆసుపత్రుల్లో 100 పడకలు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలన అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపర్చాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో IIHF గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డా. కవితా రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చోంగ్తు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC) ఎండీ డా. గౌరవ్ ఉప్పల్, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హనుమంతు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. నరేంద్ర కుమార్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డా. రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.