మెరుగైన వైద్యం కోసం ఎల్‌ఓసీలు అందజేత

ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం

భవానిపురం, ఆంధ్రప్రభ: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)లను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

39వ డివిజన్ కామకోటి నగర్‌కు చెందిన పులిపాటి మోహన్‌రావు (62) గాల్‌స్టోన్ సమస్యతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో వైద్యసాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.4.42 లక్షల విలువైన ఎల్‌ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు.

46వ డివిజన్ చిట్టినగర్‌కు చెందిన లేళ్ల ప్రకాష్‌రెడ్డి (61) హెర్నియా చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా రూ.3.45 లక్షల ఎల్‌ఓసీ అందజేశారు. అలాగే 49వ డివిజన్ ప్రైజర్‌పేటకు చెందిన వర్రి సూర్యకుమారి హృద్రోగ చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా రూ.6.50 లక్షల విలువైన ఎల్‌ఓసీని అందించారు.

త్వరితగతిన స్పందించి ఎల్‌ఓసీలు మంజూరు చేయించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు నున్న కృష్ణ, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, కూటమి నాయకులు ఏలూరి సాయి శరత్, షేక్ కరిముల్లా, దనాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.