RussiaUkraineWar | 90 క్షిపణులు, 600 డ్రోన్లతో…

RussiaUkraineWar | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. రష్యా ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రాజధాని కీవ్‌తో పాటు ఖార్కివ్, ఒడెస్సా, డ్నిప్రో, జపోరిజ్జియా నగరాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.

ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు, వందలాది మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. విద్యుత్ కేంద్రాలు, ఆయిల్ డిపోలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లు సమాచారం.

ఈ దాడుల్లో రష్యా ‘ఒరెష్నిక్’ హైపర్‌సోనిక్ మిస్సైల్‌ను వినియోగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.