కామారెడ్డి డిపోలో బస్సుల అడ్డగింత…

కామారెడ్డి డిపోలో బస్సుల అడ్డగింత…

  • కొనసాగుతున్న సమ్మె
  • పలువురు నేతల అరెస్టు

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రవాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా కామారెడ్డి డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం డిపో నుంచి నిజాంసాగర్ వెళ్లడానికి అద్దె బస్సును బయటకు తీయగా జేఏసీ నాయకులు అడ్డుకుని బస్సులో గాలి తీసేశారు. కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మద్దతుగా సమ్మెలో కూర్చున్నారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేయగా కార్మికులు అడ్డుకున్నారు.

సమ్మెకు మద్దతిస్తే ఎలా అరెస్ట్ చేస్తారని నాయకులు ప్రశ్నించారు. దాంతో పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ డ్రైవర్​ను పోలీసులు బురదలోకి తోసేశారని కార్మిక నాయకులు ఆరోపించారు. ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి ఫోన్ లాక్కున్నారని పేర్కొన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన వారిని అరెస్టు చేసినందుకు పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ.. తమకు మద్దతుగా సమ్మెలో కూర్చున్న వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇది సమ్మెను నిర్వీర్యం చేయడమేనన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు ఆర్డీవో ఎన్​వై గిరి చేరుకుని మాట్లాడారు. బస్సులు నడవకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సాధారణ ప్రజలు, పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, దారికి అడ్డు తప్పుకోవాలని సూచించారు. సమ్మెను యథావిధిగా కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్డీవో తెలపగా కార్మికులు ఒప్పుకోలేదు. బస్సులకు దారి ఇచ్చిన తర్వాత తాము సమ్మె చేయడంలో అర్థం లేదన్నారు. దారి ఇవ్వాలని ఉద్దేశ్యం ఉంటే డ్యూటీలోనే ఉండేవాళ్లమని, తమ బాధను ప్రభుత్వానికి నివేదించాలని కార్మికులు కోరారు.

Leave a Reply