అడవి దారిలో గవర్నర్ జిష్ణుదేవ్ అడుగులు
కొండపర్తి గ్రామ వాతావరణం భేష్
ఈ ఊరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
అడవి బిడ్డలకు అండగా ఉంటా
సమ్మక్క-సారక్కను దర్శించుకున్న గవర్నర్
ములుగు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. మంగళవారం తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంతోపాటు మేడారం సమ్మక్క సారక్క ఆలయాన్ని దర్శించుకున్నారు. కొండపర్తిలో పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అటవీప్రాంతానికి ఆనించి ఉన్న మూడు వందల మంది జనభా గల కొండపర్తి వాతావరణ చాలా బాగుందని గవర్నర్ ప్రశంసించారు. ఇక్కడ ప్రజలు అన్ని రకాల పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. మొదటి సారి ఇలాంటి మారుమూల పల్లెలను పర్యటించండం తనకు ఆనందంగా ఉందన్నారు.
కొండపర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా…
కొండపర్తి గ్రామాన్ని దత్తతకు తీసుకున్నానని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇక్కడ మహిళలకు స్వయం ఉపాధిపై భరోసా ఇవ్వడానికి కుట్టుమిషన్లు, కారంపొడి , పసుపు ప్రాసెసింగ్ యంత్రాలను అందించామని తెలిపారు. కుట్టు మిషన్ల ద్వారా త్వరలో విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్ లు బ్యాగులు కుట్టించబడతాయని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు మనకు తొలి మెట్టు లాంటివని అవి లేకపోతే మనం లేమని అన్నారు. కొండపర్తి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మన జీవనాన్ని మార్చుకోవడం అనేది మన చేతిలోనే ఉందన్నారు. కుటుంబాలు సంతోషంగా ఉంటేనే గ్రామం సంతోషంగా ఉంటుందని తెలిపారు. కొండపర్తి గ్రామం తెలంగాణ రాష్ట్రంలోనూ పేరుగాంచిన గ్రామంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
రోల్ మోడల్ గా కొండపర్తి
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం రూపొందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దట్టమైన అడవిలో రవాణా సౌకర్యం లేని గ్రామాన్ని గవర్నర్ విష్ణు దేవ వర్మ దత్తత తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొండపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన పసుపు కారం పొడి యూనిట్ల ద్వారా అయినా ఉత్పత్తులను హైదరాబాద్ లో అమ్ముకునేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ అందించి వారిని అభివృద్ధి చెందేల ప్రత్యేక చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు గ్రామంలో రైతులకు సాగునీరు అందించడం కోసం బోర్ వెల్ ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు పంటలకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని మెరుగుపరిచి చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో 40 కార్పొరేట్ కంపెనీలు ఐదారు గ్రామాలను దత్తత తీసుకొని ఆయా గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో 100 పాఠశాలలను ఎంపిక చేసుకుని ఆయా పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో నైపుణ్యం పొందే విధంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. త్వరలో అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ బోధనను నేర్పించే విధంగా చూస్తామని అన్నారు. గ్రామస్తులు ఐక్యతతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.