500 people | కళ్లముందేమో మురుగునీరు

500 people | కళ్లముందేమో మురుగునీరు
లక్ష్యాలు ఘనం.. వాస్తవాలు బలహీనం
స్వర్ణాంధ్ర లక్ష్యంపై సవాలక్ష సమస్యలు
500 people | పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి రూప కల్పన చేసింది. ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ లక్ష్యంగా ప్రారంభించిన ఈ ప్రత్యేక డ్రైవ్ నాలుగు వారాల పాటు కొనసాగుతుంది. పల్నాడు జిల్లాలో 8 మున్సిపాలిటిలలోనూ కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవలే ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు చెత్తను ఊడుస్తూ, ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నాలుగు వారాల పాటు లక్ష్యాలను నిర్ధేశించి వాటిని అధిగమించాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదటి వారం రోడ్లు, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, పేరుకుపోయిన చెత్త దిబ్బలు తొలగించడం. రెండవ వారం మురుగు కాలువలు, డ్రైనేజీలను శుభ్రం చేసి నీరు నిల్వ లేకుండా చూడటం. మూడవ వారం ఇళ్లు, వాణిజ్య సముదాయాల వద్ద చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేయడంపై ప్రజలకు అవగాహన కల్పించడం. నాలుగో వారం.. పబ్లిక్ టాయిలెట్స్ (సార్వజనిక మరుగుదొడ్లు) పరిశుభ్రంగా నిర్వహించడంపై దృష్టి సారించాలని అధికారులు నిర్ణయించారు.

500 people | లక్ష్యాన్ని నీరుగారుస్తున్న సిబ్బంది కొరత..
ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. అధికారులు రికార్డుల్లో వంద శాతం పారిశుధ్యం, డ్రైనేజీల క్లియరెన్స్, చెత్త సేకరణ జరుగుతోందని చెబుతుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉంటాయి. రికార్డుల్లో నిర్దేశిత సంఖ్యలో శానిటేషన్ వర్కర్లు ఉన్నట్లు చూపుతారు. కానీ వాస్తవంగా అందులో చాలా మంది సిబ్బంది విధులకు గైర్హాజరు కావడం లేదా అధికారులు వారిని ఇతర పనులకు మళ్లించడం వల్ల క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి ఇంటికీ చెత్త సేకరణ వాహనాలు వస్తున్నాయని రికార్డులు చెబుతాయి. కానీ వాస్తవంలో చాలా కాలనీలు, శివారు ప్రాంతాలకు ఈ వాహనాలు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో ప్రజలు చెత్తను రోడ్లపై, ఖాళీ స్థలాల్లో లేదా డ్రైనేజీల్లో పడేస్తున్నారు. వర్షాలు లేదా సాధారణ సమయాల్లో మురుగు కాలువలు నిరంతరం పొంగిపొర్లుతుంటాయి. దోమల బెడద విపరీతంగా ఉంటుంది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పూడికతీతలు, బ్లీచింగ్ పౌడర్ చల్లే కార్యక్రమాలు పకడ్బందీగా జరుగుతున్నాయని నివేదికలు పంపడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా తెలుస్తోంది.

500 people | కళ్లకు గంతలు..
వాస్తవంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో యంత్రంగమంతా సమన్వయంతో పనిచేయాలి. పాత కాలపు మురుగునీటి వ్యవస్థ అనేక మున్సిపాలిటీల్లో ఇంకా అమలులో ఉంది. అనేక మురుగు నీటి కాల్వలు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించి కాల్వలు శుభ్రం చేయడం అంటే ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదు. ప్రతి 500 మంది ప్రజలకు ఒక పారిశుధ్య కార్మికుడు ఉండాలి. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలోనూ జనాభా తగ్గట్లు పారిశుద్య కార్మికులు ఉన్న దాఖలాలు లేవు. ఉన్న సిబ్బందితోనే పారిశుధ్యాన్ని మమ అని పిస్తున్నారు.

పారిశుధ్య నిర్వహణకు కేటాయించే నిధులు క్షేత్రస్థాయి వరకు సక్రమంగా చేరట్లేదు. ప్రైవేటు వాహనాలు, సిబ్బంది బిల్లుల్లో అవకతవకలు జరగడం, రికార్డుల్లో చూపిన ఖర్చులకు, వాస్తవ పనులకు పొంతన లేకపోవడం తరచుగా జరుగుతుంటుంది. ఇలా అనేక విషయాల్లో అధికారులు కళ్లకు గంతలు కట్టి అంతా బాగానే ఉందని వెబ్సైట్లలో అప్ లోడ్ చేయడం, అంతా బాగానే ఉందని ఉన్నతాధికారులు భావించటం జరుగుతున్న తంతే. మరోవైపు అనేక మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరించే పుష్కాట్లు మరమత్తులకు గురై మూలన పడ్డాయి. అనేక ప్రాంతాల్లో చెత్త తరలించటానికి తగినన్ని వాహనాలు లేకపోవడంతో రోజూవారి చెత్త తరలింపు కూడా కష్టంగా మారుతోంది.
CLICK HERE TO READ MORE : politics | కర్ణాటకలో ఎమ్మెల్యేగానే కొనసాగుతా…
