కడప : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తాను జరిపిన యువగళం విశేషాలతో పుస్తక సంకలనం చేశారు. ఈ మహానాడులో ఆ పుస్తకాన్ని చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. అనంతరం తొలి ప్రతిని తండ్రికి గిఫ్ట్ గా అందజేశారు.ఈ సందర్భంగా లోకేశ్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తుచేసుకున్నారు.
ఈపుస్తకాన్ని తనకు స్ఫూర్తిప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేశ్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా స్ఫురణకు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర ఆసాంతం తనకు అండగా నిలిచి, నాపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మహానాడు వంటి కీలకమైన సందర్భంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం, తొలి ప్రతిని చంద్రబాబుకు అందించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.
