తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి..
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి..
రైతు సమస్యల పై స్పందించని ప్రభుత్వం
పట్టించుకొని ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి
మరో రెండు రోజుల్లో మృగశిర కార్తె
వర్షాలతో మరింత ధాన్యం తడిసే అవకాశం
మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్ – సిద్దిపేట హైవే పై మొలకెత్తిన ధాన్యంతో రాస్తారోకో
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారీ వర్షాలకు తడిసి, మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మండల నాయకులు, రైతులతో కలిసి సందర్శించారు. అనంతరం మెదక్- సిద్దిపేట హైవే పైన రోడ్డుపై మొలకెత్తిన ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 లారీల ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని రైతులు తమకు వివరించారన్నారు.
శుక్రవారం కురిసిన భారీ వర్షంతో 2 కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతుల కష్టాలు స్థానిక ఎమ్మెల్యే కనిపించడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి మాదిరిగానే ఎమ్మెల్యే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మరో రెండు రోజుల్లో మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ధాన్యం పూర్తిగా ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లారీల కొరత, కూలీల కొరత కారణంగా ధాన్యం తరలింపు నిలిచిపోయిందని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్మిల్లర్లు సంచికి అదనంగా ఐదు కిలోల ధాన్యం వేస్తేనే తీసుకుంటామని చెప్పడం వల్ల రైతులు క్వింటాలుకు 12 కిలోల వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, అవసరమైన లారీలను పంపి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్ గౌడ్, నిజాంపేట్ ఎంపీపీ సంపత్, సీనియర్ నాయకులు చౌదరి. సుప్రభాతారావు, మాజీ సర్పంచ్ నర్స గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యం, బిక్షపతి, నాయకులు ఉమామహేశ్వర్, అబ్దుల్ అజిజ్, హస్నోద్దీన్, రొయ్యల నవీన్, మధుకర్ రాంకీ శ్రావణ్, మహేష్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
