కడపలో ఉత్కంఠభరిత క్రికెట్ మ్యాచ్

  • విజయవాడ సన్ షైనర్స్ భారీ స్కోర్ నమోదు

కడప, విజయవాడ, ఆంధ్రప్రభ: కడప వేదికగా జరిగిన విజయవాడ సన్ షైనర్స్ vs తుంగభద్ర వారియర్స్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తింది. మొదటి మ్యాచ్‌కే స్టేడియం పూర్తిగా నిండిపోవడం టోర్నమెంట్‌కు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ గాయకురాలు సునీత తన గానంతో ప్రేక్షకులను అలరించారు. టాస్ వేయడానికి ముఖ్య అతిథిగా బీసీసీఐ అపెక్స్ మెంబర్ చముండేశ్వరినాథ్ హాజరయ్యారు. టాస్ గెలిచిన విజయవాడ సన్ షైనర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

పవర్‌ప్లేలోనే వేగవంతమైన ఆరంభం నమోదు చేసింది విజయవాడ జట్టు. 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 55 పరుగులు చేసి బలమైన పునాది వేసింది. ఓపెనర్ అశ్విన్ హెబ్బర్ విధ్వంసకర ఆటతీరుతో 16 బంతుల్లో 34 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. మధ్య ఓవర్లలో కూడా విజయవాడ దూకుడును కొనసాగించింది. 13 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగింది. అశ్విన్ హెబ్బర్ అర్ధశతకం దాటగా, స్థానిక కడప ఆటగాడు అబ్బాస్ పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఇన్నింగ్స్ చివరికి విజయవాడ సన్ షైనర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బర్ 48 బంతుల్లో 85 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జహీర్ అబ్బాస్ 25 బంతుల్లో 52 పరుగులు (3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తుంగభద్ర వారియర్స్ బౌలింగ్‌లో దీపక్, హిమశ్రీనివాస్ చెరో 2 వికెట్లు తీశారు.