హైదరాబాద్ – తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోదం తెలపగా.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడం విశేషం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా, అంతఃకరణ శుద్దితో ముందుకు వెళ్తున్నామని భట్టి తెలిపారు.
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్ : భట్టి
2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాం: భట్టి
‘సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి జోడు గుర్రాలు.. అంబేడ్కర్ సూచించిన నైతిక విలువలు పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నాం. నిరాధార ఆరోపణలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే సవాళ్లను అదిగమించాం’ అని అన్నారు. ఇక ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి రూ.24 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు.. బడ్జెట్ లో అగ్రపీఠం ఎస్సీ సంక్షేమానికి దక్కింది. ఈ బడ్జటె్ లో వారి సంక్షేమం కోసం ఏకంగా 40 వేల కోట్లు కేటాయించారు. పంచాయితీ రాజ్ శాఖకు రూ.31,605 కోట్లు కేటాయించారు.. విద్య శాఖకు రూ.23,108 కోట్లు దక్కాయి. ఇక ఎస్టీ సంక్షేమానికి రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమం- 11,405 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయనున్నారు..
రైతు భరోసాకు రూ.18 వేల కోట్ల బడ్జెట్
డిప్యూటీ సీఎం శాసన సభలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘రైతు భరోసాకు రూ.18000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్, 40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు, ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు రూ.2000 అదనపు సబ్సిడీ, వడ్ల బోనస్ కింద రైతులకు రూ.1,206 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు: భట్టి
వైద్య కళాశాలలకు భారీగా నిధులు కేటాయించినట్లు భట్టి తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు పేర్కొన్నారు. దీంతో 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ లబ్ధి చేకూరుతుందని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చును 20 శాతం పెంచామని భట్టి తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్
ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘స్కూల్స్ లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ తో పాటు ఉచిత వసతులు. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు. విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం. 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి రూ. 11,600 కోట్లు’ కేటాయించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు భారీగా కేటాయింపు
ఆరు గ్యారంటీలలకు బడ్జెట్లో రూ.56,084 కోట్లని కేటాయించింది. రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, చేయూత పింఛన్లుకు రూ.14,861 కోట్లు కేటాయించారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లు, మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు)కి రూ.4,305 కోట్లు కేటాయింపులు చేశారు. గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు రూ.5,006 కోట్లు ఆదా
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు రూ.5,006 కోట్లు ఆదా అయ్యిందని ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి పెరిగిందన్నారు. ‘సిలిండర్ల రాయితీ కింద రూ.433 కోట్లు చెల్లించాం. గృహజ్యోతి పథకం కోసం రూ.1,775 కోట్లు రాయితీ ఇచ్చాం. రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు, గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది’ అని భట్టి తెలిపారు.
చేయూత పెన్షనర్లకు గుడ్ న్యూస్.. బడ్జెట్లో రూ.14,861 కోట్లు కేటాయింపు
ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు కేటాయింపులు చేసినట్లు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. చేయూత పింఛన్లకు రూ.14,861 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ రాయితీ కోసం రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు, విద్యుత్ రాయితీ కోసం రూ.11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం కోసం రూ.6 వేల కోట్లు కేటాయించినట్లు భట్టి తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.11,600కోట్లు
తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు కేటాయించామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మొదటి విడతలో నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఆ స్కూల్స్లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్తో పాటు ఉచిత వసతులు కల్పిస్తామని అన్నారు. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచమని వెల్లడించారు.
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు.. రూ.1,511 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అసెంబ్లీలో ప్రకటించారు. రూ.1,511 కోట్లు, SDF/ CDP ఫండ్స్ రూ. 3, 300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలందరికీ ఉపాధితో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలకు ప్రభుత్వం ఊతమిస్తోందన్నారు.
తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో పాలన సాగిస్తున్నాం
తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో పాలన సాగిస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారీ చేశామన్నారు. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేశామని, చైనా ప్లస్ వన్ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం’ అని భట్టి తెలిపారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి:
పంచాయతీరాజ్ శాఖ- రూ.31,605 కోట్లు
వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
విద్యాశాఖ- రూ.23,108కోట్లు
మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు
పశు సంవర్థకశాఖ- రూ.1,674 కోట్లు
పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు
కార్మికశాఖ- రూ.900 కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం- 11,405 కోట్లు
చేనేత రంగానికి- రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు
పరిశ్రమలశాఖ- రూ.3,527 కోట్లు
ఐటీ రంగం- రూ.774 కోట్లు
విద్యుత్ రంగం- రూ.21,221 కోట్లు
వైద్య రంగం- రూ.12,393 కోట్లు
పురపాలక రంగం- రూ.17,677 కోట్లు
నీటి పారుదలశాఖ- రూ.23,373 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ- రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం- రూ.775 కోట్లు
క్రీడలు- రూ.465 కోట్లు
అటవీ, పర్యావరణం- రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ- రూ.190 కోట్లు