న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం ముందుకు మరోసారి విచారణకు రానుంది. కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీజనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం విచారణ జరపనుంది.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు అయ్యింది..
పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి, ఈ పిటిషన్లు వేశారు. అయితే..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించి నెలలు గడుస్తున్నా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది.
అయితే.. తెలంగాణ స్పీకర్ కార్యాలయం మాత్రం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటున్నట్లు చెబుతోంది. గత విచారణ సందర్భంగా స్పీకర్, స్పీకర్ కార్యదర్శి, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22వ తేదీలోపు దీనిపై రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం మహిపాల్రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు.
తాజాగా స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి కూడా అఫిడవిట్ వేశారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. పిటిషనర్లు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని, పిటిషన్లు కొట్టేయాలని పేర్కొన్నారు.
గత విచారణల సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. స్పీకర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో.. తాజా పరిణామాల దృష్ట్యా సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాలి.