బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్ల (BC Reservation) కల్పన కోసం అభిషేక్ మనుసింగ్వితో వాదనలు వినిపిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని, తమకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చు అని పేర్కొన్నారు. సిపెక్ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో వాదనలకు సిద్ధం!
సుప్రీంలో వాదనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (BC Welfare Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తాము తీసుకున్న నిర్ణయాలకు అన్నిపార్టీల అభిప్రాయం ఉందని కోర్టుకు తెలియజేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తీర్పు అనుకూలంగానే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ఈడబ్ల్యూ ఎస్ తోనే రిజర్వేషన్ పరిమితి 50శాతం దాటిందని పేర్కొన్నారు.
