హైదరాబాద్, : హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరు 3వ తేదీన హైడ్రా స్పష్టమైన ప్రకటన చేసింది. అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు.
లేని పక్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అవకతవకలు నిజమైన పక్షంలో హైడ్రా ఉద్యోగులైతే సస్పెండ్ చేయడంతో పాటు.. కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రత్యక్షంగా కాని.. పరోక్షంగా కాని హైడ్రా పేరును వినియోగించుకుని వసూళ్లకు పాల్పడినా, అవకతవకలు చేసినా వారిపైనా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురిపై కేసులు కూడా పెట్టామన్నారు.
నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తున్నట్టు ఏవైనా ఫిర్యాదులుంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి గారు తమ దృష్టికి కాని, ఏసీబీ, విజిలెన్స్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు.
వంశీరాం బిల్డర్లపై ఎమ్మెల్యే ఫిర్యాదు అందలేదు..
గత సంవత్సరం 18.8.24న, 21.12.24 తేదీల్లో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి నుంచి హైడ్రాకు రెండు ఫిర్యాదులు అందాయి. ఖాజాగూడలోని తౌతానికుంటలో నీరు నిలిచిపోవడం వల్ల.. గ్రీన్గ్రేస్ అపార్టుమెంట్ సెల్లార్లోకి నీరు చేరుతోందనేది ఒకటి కాగా.. తౌతానికుంట నిండిన తర్వాత వరద నీరు భగీరథమ్మచెరువుకు వెళ్లడంలేదనేది రెండోది.
ఈ రెండు ఫిర్యాదులపైన కూడా నేరుగా తానే రెండు సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకున్న విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. పైనుంచి వచ్చిన వరదను తౌతానికుంటకు తర్వాత భగీరథమ్మ చెరువులోకి వెళ్లే అవకాశాలను పరిశీలించారు. భగీరథమ్మ చెరువులో ఆక్రమణలు గత ఏడాది డిసెంబరు చివరి వారంలో హైడ్రా తొలగించింది.
వంశీరాం మ్యాన్హట్టన్ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ విషయంలో వారి వద్ద ఏమైనా ఫిర్యాదు ఉంటే వాట్సప్లో అయినా పంపితే పరిశీలిస్తాం. గతంలో ఎమ్మెల్యే వాట్సాప్లో సమస్యను చెబితే స్పందించాం కూడా. ప్రజాప్రతినిధుల ఫిర్యాదులకు ప్రాధన్యత ఉంటుందన్నారు.
ఫిర్యాదు ఎవరిదైనా తక్షణ స్పందన :
ఫోన్లు వస్తే వెంటనే మాట్లాడి సమస్య తెలుసుకోవడం.. ఒక వేళ సమావేశాల్లో ఉన్నప్పుడు ఫోను లిఫ్ట్ చేయలేకపోయినా.. ఫిర్యాదుదారులు మెసేజ్ పెడితే స్పందించడం సర్వసాధరణంగా జరుగుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనే కాకుండా.. పని దినాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల ఫిర్యాదులకే స్పందన కరువా అని అనిరుధ్రెడ్డి ఆరోపణలు చేసినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ వివరణ ఇచ్చారు.
ఫిర్యాదులపై వెంటనే చర్యలు:
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా వెంటనే స్పందిస్తుంది. నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటోంది. ఫిర్యాదులపై హైడ్రా వెంటనే స్పందిస్తుందని ప్రజలు గ్రహించారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే దశాబ్దాల సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం లభిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.
ఇలా హైడ్రాకు 9800ల ఫిర్యాదులందాయి. వీటిలో చాలా వరకు పరిష్కారమయ్యాయి. ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, సాంకేతికంగా, క్షుణ్నంగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారానికి సమయం తీసుకోడానికి ఇవే కారణాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.
ఫిర్యాదులపై సమీక్ష:
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకూ నిర్వహించే ప్రజావాణిలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఫిర్యాదు దారుల ముందే.. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ఆధారంగా.. అప్పటికప్పుడే సమస్యపై చర్చించి.. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగిస్తారు.
అక్కడితో ఆగకుండా.. ఫిర్యాదుల పరిష్కారం ఎంతవరకు వచ్చిందనేది వారంలో రెండు రోజులు కమిషనర్ సమీక్షిస్తారు. కొన్ని పిర్యాదులపై నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తారు.