ఏపీసీపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పి. పుల్లారెడ్డి సమీక్ష

ఏపీసీపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పి. పుల్లారెడ్డి సమీక్ష

నరసరావుపేట, ఆంధ్రప్రభ : ఏపీసీపీడీసీఎల్ పల్నాడు సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పి. పుల్లారెడ్డి మంగళవారం సర్కిల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించాలని, రెవెన్యూ కలెక్షన్లు వంద శాతం సాధించాలని, లో వోల్టేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఫీడర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ బ్రేక్‌డౌన్‌లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మార్చి నెలలో వంద శాతం రెవెన్యూ కలెక్షన్లు సాధించామని, అయితే ఏప్రిల్ నెలలో కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు అందకపోవడంతో సుమారు ఐదు శాతం రెవెన్యూ తగ్గిందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ కాలనీలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సోలార్ రూఫ్‌టాప్ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. సీపీడీసీఎల్ పరిధిలో లక్ష్యంగా పెట్టుకున్న 1.91 లక్షల కనెక్షన్లకు ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను ఆగస్టు నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందన్నారు.

ఈ కార్యక్రమానికి అవసరమైన మెటీరియల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని, మిగిలిన సామగ్రి కూడా త్వరలో చేరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ రూఫ్‌టాప్ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు సీపీడీసీఎల్ పరిధిలో దాదాపు 40 వేల కనెక్షన్లు ఇచ్చామని, పల్నాడు జిల్లాలోనే 3200 కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కొన్ని మండలాల్లో పురోగతి తక్కువగా ఉండటంపై సమీక్ష నిర్వహించి, అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పల్నాడు జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం 42.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 12 సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పెండింగ్ దరఖాస్తులను మూడు నెలల్లోపు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన పోల్స్, మెటీరియల్ సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన సామగ్రి కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు సమయానికి రావడం లేదని, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ నుంచి మరియు నాగార్జునసాగర్ ప్రాంతానికి సంబంధించిన సుమారు రూ.40 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. సంబంధిత శాఖలు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.

ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడంతో పాటు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్‌ఎన్ మూర్తి, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ పి. విజయ్ కుమార్ తదితర ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply