ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈరోజు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్… ఆర్సీబీని చిత్తుగా ఓడించింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ ఢిల్లీ బౌలర్ల ధాటికి 163 పరుగుకే చేసింది. ఇక 164 పరుగులు స్వల్ప టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన ఢిల్లీ.. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రఫ్పాడించాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలినప్పటికీ… కేఎల్ ఒంటి చేత్తో మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చాడు. కేఎల్ రాహుల్ కి తోడు ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 38) దంచికొట్టాడు. వీరిద్దరూ కలిసి 5వి వికెట్ కు కేవలం 55 బంతుల్లో 111 పరుగులు అందించారు. దీంతో హోం గ్రౌండ్ లో ఆర్సీబీకి మరో ఓటమి తప్పలేదు.
బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. యష్ దయాల్, సుయాష్ శర్మ ఒక్కో వికెట్ తీశారు.
అంతకముందు బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు బ్యాటర్లు ఢిల్లీ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఆర్సీబీ 163/7 పరుగులకే పరిమితమైంది. స్పిన్నర్లు విప్రాజ్ నిగ్గమ్ (2/18), కుల్దీప్ యాదవ్ (2/17) తలా రెండు వికెట్లు తీసి ఆర్సీబిని దెబ్బతీశారు. ఇక ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ ఒక్కో వికట్ దక్కించుకున్నారు.
ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఉగ్రరూపంతో విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు దంచేశాడు సాల్ట్. అయితే, ఢిల్లీ బౌలర్లను బాదేస్తున్న ఫిలిప్ సాల్ట్.. 3.5 ఓవర్లలో రన్ ఔట్ అయ్యాడు. ఇక అప్పటి నుండి, ఢిల్లీదే పైచేయిగా కొనసాగింది.
ఫిలిప్ సాల్ట్ ఔటయ్యే సమయానికి ఆర్సీబీ స్కోర్ 3.5 ఓవర్లలో 61/1 కాగా.. 9.3 ఓవర్లకు మరో 30 పరుగులు చేసి 91 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది బెంగళూరు. విరాట్ కోహ్లీ (22), కెప్టెన్ రజత్ పాటీదర్ (25), కృణాల్ పాండ్యా (18) పరుగులు సాధించగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ (37) బౌండరీలు బాదడంతో బెంగళూరు స్కోరు బోర్డు కొద్దిగా మెరుగుపడింది.