TG | దేశవ్యాప్తంగా కులగణన చేయడమే రాహుల్ లక్ష్యం.. సీఎం రేవంత్
- తొలి అడుగుగా తెలంగాణ నుంచే ప్రారంభించాం
- ఆ ఘనత నాకు దక్కడం అదృష్టం
- మా బిసి లెక్కలన్నీ పక్కా…
- కెసిఆర్ వి అన్ని దొంగ లెక్కలే
- రాజకీయ లబ్ధి కోసమే బిఆర్ఎస్, బిజెపిల విమర్శలు
- బిసి నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి ఉద్ఘాటన
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కులగణన విషయంలో ఎంతో మంది రాష్ట్రానికి సీఎంలుగా పనిచేసినా ఎవరికీ రాని అవకాశం తనకు వచ్చిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ మోడల్ను దేశం మొత్తం అమలు చేయాలనే కార్యాచరణను రాహుల్ గాంధీ సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ప్రజాభవన్ లో ఇవాళ జరిగిన బిసి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అందుకే బీజేపీ నేతలు కులగణనను తప్పుబడుతున్నారన్నారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీలదేనని.. అంతా తానే చూసుకుంటానని అనుకోవడం సరికాదని తెలిపారు.
ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శాస్త్రీయంగా కులగణ సర్వే నిర్వహించామని లెక్కలు తప్పు అని కొందరు విమర్శిస్తున్నారని.. ఎక్కడ తప్పు ఉందో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. న్యాయపరంగా ఇబ్బందులు రావొద్దనే రెండోసారి కులగణన సర్వేకు అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవరూ తీయలేదని గుర్తు చేశారు రేవంత్. రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలు డిమాండ్ చేయకముందే రాహుల్ హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకు సీఎంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసానికి తాను పూనుకున్నట్లుగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకలజనుల సర్వే పేరుతో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారని ఆ సర్వేలో తప్పులు ఉన్నాయి కాబట్టే లెక్కలు అధికారికంగా బయట పెట్టలేదని అన్నారు.
150ఇళ్లను క్లస్టర్గా తీసుకుని అత్యంత పకడ్బందీగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పారదర్శకంగా సర్వే చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో తప్పులు ఎక్కడ ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. గణాంకాలు మా ఇష్టపూర్వకంగా తాము రాయలేదని.. ఇంటి యజమాని స్వయంగా చెప్పిన లెక్కలే మా సర్వేలో ఉన్నాయని స్పష్టం చేశారు.
తమ లెక్కలను తప్పని చెప్పే వాళ్లు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చని అన్నారు. పారదర్శకంగా సర్వే చేస్తే విపక్షాలు తప్పని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు వివరాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓసీల సంఖ్యను కేసీఆర్ తన సకలజనుల సర్వేలో 21శాతంగా చూపించారని వాస్తవానికి తాము చేపట్టిన సమగ్ర సర్వేలో వారు 17శాతమే ఉన్నట్లుగా తేలిందన్నారు. ఇక్కడే తప్పు ఎవరు చేశారో తేటతెల్లం అవుతోందని సెటైర్లు వేశారు. గుజరాత్ లో ముస్లీంలను బిసిలలో మోడీ కలిపారని అంటూ తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింలను బీసీల్లో కలిపితే బండి సంజయ్ ఎట్లా విమర్శిస్తారని ఫైర్ అయ్యారు.