Nampally CBI Court | వ‌చ్చే వారం రా… సీబీఐ కోర్టు ఆదేశం!

Nampally CBI Court | వ‌చ్చే వారం రా… సీబీఐ కోర్టు ఆదేశం!

ఆంధ్రప్రభ : అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally CBI Court)లో ఈరోజు హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan) విచారణ అనంతరం బెంగళూరుకు రిటర్న్ ఫ్లైట్ ఎక్కారు. కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్న జగన్, సుమారు 11.40 గంటలకు కోర్టులోకి ప్రవేశించారు.

అయితే, కోర్టులో ఆయన గడిపిన సమయం కేవలం 25–30 నిమిషాలు మాత్ర‌మే. జగన్ హాజరును న్యాయస్థానం రికార్డులో నమోదు చేసి, కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన విచారణకు హాజరైనట్లు స్పష్టం చేసింది. ఇక అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు, కేసును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్‌పై ఉన్న జగన్‌పై సీబీఐ ఇప్పటివరకు 11 ఛార్జిషీట్లు దాఖలు చేసింది.

జగన్ కోర్టుకు రాగానే నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద వైసీపీ శ్రేణులు భారీగా గుమికూడడంతో అక్కడ కొంతసేపు హంగామా చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం 12:20 గంటలకు కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్, లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని… అక్కడి నుండి ఆయన బెంగళూరుకు రిటర్న్ ఫ్లైట్ ఎక్కారు.

Leave a Reply