రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పథకాలకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద తగిన విధంగా సహకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జాతీయ వ్యవసాయ , గ్రామీణాభివృద్ధి బ్యాంకు – నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ వీ ని కోరారు. తక్కువ వడ్డీకి రుణాలను అందజేయాలని కోరారు.నేడు నాబార్డ్ ప్రతినిధుల బృందం రేవంత్ తో సమావేశమైంది.. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో సహకార సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సహకార సొసైటీలను ఏర్పాటు చేయాలని కోరారు
మైక్రో ఇరిగేషన్కు నిధులు ఇవ్వాలని, స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి సహకరించాలని కోరారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను కూడా నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. అలాగే కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నాబార్డు అమలు చేస్తున్న పథకాల కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నిధులు మార్చ్ 31 లోగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని చెప్పారు. కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నాబార్డు చైర్మన్ ముఖ్యమంత్రితో ప్రస్తావించారు.
ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి , పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.