రామయ్యను దర్శించుకున్న మంత్రి సీతక్క..

భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

సమ్మక్క–సారక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లుగానే, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని కూడా మొదటి విడతలో రూ.351 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు సహకరించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

భవిష్యత్తులో భద్రాచలం మరింత అభివృద్ధి చెంది దేశవ్యాప్తంగా ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వరరావు, ఆలయ ఈవో దామోదర్, భద్రాచలం సర్పంచ్ కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply