రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు

డబ్బు స్వీకరిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడి

మెట్‌పల్లి, ఆంధ్రప్రభ: రైతు పాస్‌బుక్‌లో పేరు సరిదిద్దేందుకు రూ.5 వేల లంచం కోరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీ అధికారి (జీపీవో) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామ పంచాయతీలో గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఆత్మకూరు గ్రామానికి చెందిన మల్లేశ్ అనే రైతు భూ పాస్‌బుక్‌లో తన పేరు తప్పుగా నమోదవడంతో దానిని సరిచేయాలని గ్రామ పంచాయతీ అధికారి రాజేశ్‌ను సంప్రదించాడు. అయితే, ఈ పని చేసేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ప్రత్యేక ఉచ్చును ఏర్పాటు చేశారు. రసాయనం పూసిన రూ.5 వేల నగదును బాధితుడి ద్వారా అందజేశారు. గురువారం ఆ నగదును జీపీవో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని అవసరమైన చట్టపరమైన ప్రక్రియ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.