టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్కు దరఖాస్తుల ఆహ్వానం
హనుమకొండ జిల్లాకు నాలుగు పోస్టుల కేటాయింపు
హనుమకొండ, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులకు అంతర్జాతీయ విద్యా అనుభవాన్ని కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న **టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్, ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం–ఫేజ్-II (2026)**లో పాల్గొనేందుకు హనుమకొండ జిల్లా నుంచి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమం కింద హనుమకొండ జిల్లాకు మొత్తం నాలుగు పోస్టులు కేటాయించారు. వీటిలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు రెండు పోస్టులు, స్కూల్ అసిస్టెంట్/పీజీటీ/పీఎస్హెచ్ఎం కేటగిరీకి ఒక పోస్టు, ఎస్జీటీ/టీజీటీ/ఎల్పీ/పీఈటీ కేటగిరీకి ఒక పోస్టు కేటాయించినట్లు వెల్లడించారు.
ఎంపికలో ప్రభుత్వ నిబంధనల మేరకు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు తమ ప్రధానోపాధ్యాయుల సిఫారసుతో మండల విద్యాధికారి (ఎంఈవో) ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 4, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్ణయించినట్లు తెలిపారు. గడువు తర్వాత అందిన దరఖాస్తులు లేదా ప్రాపర్ ఛానల్ ద్వారా సమర్పించని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించి, ఎంపిక కమిటీ ద్వారా రాష్ట్రానికి సిఫారసు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కోరారు.
