Ghost Pairing | ఆ లింక్ క్లిక్ చేస్తే.. మటాష్!

Ghost Pairing | ఆ లింక్ క్లిక్ చేస్తే.. మటాష్!
- Ghost Pairing | వాట్సాప్ యూజర్లూ జాగ్రత్త సుమీ!
Ghost Pairing | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సైబర్ నేరగాళ్ళు సరి కొత్త విధంగా ఆన్లైన్ మోసాలకు తెర తీస్తున్నారు. ఏ లింక్ నొక్కినా ఏమి జరుగుతుందా కూడా తెలియని పరిస్థితి. ఒక్కప్పుడు డబ్బుల కోసం ఆన్లైన్(Online) మోసాలు చేయగా, ఇప్పుడు ఏకంగా డేటా తీసుకుని నేరస్థుల చేతిలోకి ఇవ్వడానికి మోసాలు చేస్తున్నారు. మోసం అనేది ఏ రకంగా ముంచుకు వస్తుందో సామాన్యుడికే కాదు సాంకేతిక పరిజ్ఞాన ఉన్న వ్యక్తులు కూడా తెలుసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్(Commissioner V.C. Sajjanar) ప్రజలను చైతన్యం కల్పిస్తున్నారు.

హాయ్.. మీ ఫోటో చూశారా? మీ గురించి ఎవరో ఇలా రాశారు? అంటూ మీ వాట్సాప్కు ఏదైనా లింక్ వచ్చిందా? అది మీ స్నేహితులు గానీ, బంధువుల గానీ నుంచి వచ్చినా సరే పొరపాటున కూడా క్లిక్(Click) చేయకండి. మీరు చేసే ఆ ఒక్క క్లిక్ మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ల పరం చేస్తుందని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ‘ఘోస్ట్ పేయిరింగ్’ (Ghost Pairing) అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను దోచుకుంటున్నట్లు సజ్జనార్ తెలిపారు.
Ghost Pairing |అసలేమిటీ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్?
సాధారణంగా మనం వాట్సాప్ వెబ్ను కనెక్ట్ చేయాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి. లేదా OTP ఎంటర్ చేయాలి. కానీ ఈ మోసంలో: హ్యాకర్లు పంపిన లింక్ను మీరు క్లిక్ చేయగానే ఒక నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ(WhatsApp web page) ఓపెన్ అవుతుంది. మీరు ఆ పేజీని చూడగానే, మీకు తెలియకుండానే మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్కు కనెక్ట్ (Pair) అయిపోతుంది.
దీని కోసం వారికి మీ ఫోన్ భౌతికంగా అవసరం లేదు, కనీసం OTP కూడా అడగరు. అందుకే దీన్ని ‘ఘోస్ట్ పేయిరింగ్’ అని పిలుస్తున్నారు. దీని ద్వారా మీ డేటాను హ్యాకర్ల చేతిలోకి వెళుతుంది. దీంతో మీ చాటింగ్స్(Chattings), పర్సనల్ ఫోటోలు, వీడియోలు అన్నీ హ్యాకర్లు చూడగలరు. మీ కాంటాక్ట్ లిస్ట్ దొంగిలించి, మీ పేరుతో ఇతరులకు మెసేజ్ లు పంపి డబ్బులు అడుగుతారు. చివరకు మీ వాట్సాప్ ఖాతాను మీరే వాడలేకుండా వారు లాక్ చేసే ప్రమాదం ఉంది.
Ghost Pairing|ఈ జాగ్రత్తలు పాటించాలి…


సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్గా ఉంటారు.టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, మన చిన్నపాటి అజాగ్రత్తే సైబర్ నేరగాళ్ల(cyber criminals)కు పెట్టుబడిగా మారుతుందని సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సైబర్ సెక్యూరిటీ పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని, ఈ సమాచారాన్ని తన కుటుంబ సభ్యులు, మిత్రులకు షేర్ చేయాలని సూచించారు.
- ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గానీ, అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయవద్దు.
- ఒకవేళ పొరపాటున లింక్ ఓపెన్(Link open) చేసినా, మీ వాట్సాప్ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి ‘Linked Devices’ ఆప్షన్ను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి.
- అక్కడ మీకు తెలియని లేదా మీది కాని వేరే ఏదైనా డివైజ్ లాగిన్ అయి కనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దానిని ‘Logout’ చేయాలి.
- అకౌంట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ ఖాతాలో ‘Two-step verification’ ఫీచర్ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.
