ఫాలోవర్స్ కోసం హద్దులు దాటుతున్న యువతరం

ఫాలోవర్స్ కోసం హద్దులు దాటుతున్న యువతరం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రీల్స్ చేయడం.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం… ఎంత ఎక్కువ మంది నుంచి లైక్స్.. వస్తే అంత గొప్పగా ఫీలవడం ఇప్పుడు యువతలో ఓ జాఢ్యంలా మారిపోయింది. ఇదే వారిపాలిట ప్రమాదకరంగా మారుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, స్నాప్డేట్ స్ట్రీక్స్… నేటి జెన్ జీ జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం కాదు, దాదాపు ప్రపంచమే అయిపోయింది. అయితే ఈ వర్చువల్ ప్రపంచంలో గుర్తింపు కోసం కొందరు యువత తీసుకుంటు న్న ప్రమాదకర నిర్ణయాలు ఇప్పుడు తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు, పోలీసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఒకప్పుడు ప్రతిభ చూపించేందుకు వేదికలు వెతికే యువత… ఇప్పుడు కేవలం వ్యూస్ కోసం వెకిలి వేషాలు వేస్తున్నారు. రైళ్లపై సెల్ఫీలు, ఫ్లైఓవర్లపై స్టంట్లు, రోడ్లపై బైక్ రేసింగ్, ప్రమాదకర ప్రాంక్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావాలనే కోరికతో జరుగుతున్న ఘటనలే. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు… అనే భావన యువతలో పెరుగుతోంది. దీనికోసం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిం చడం, ప్రజలను భయపెట్టే ప్రాంక్స్ చేయడం, పబ్లిక్ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం… నిత్యకృత్యంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ స్టంట్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా అనేక
ఘటనల్లో యువకులు రీల్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ గాయపడటం, మరణించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా… సోషల్ మీడియా మోజు మాత్రం తగ్గడం లేదు. ఫాలోవర్లను పెంచుకునేందుకు, లైన్ల కోసం రకరకాల వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇందుకోసం తలకు మించిన ఆలోచన చేశాడు ఓ యువకుడు. తనకు బతకాలని లేదని ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్గా మాట్లాడుతూ.. ఒక వీడియో తీసి దాన్ని సోషల్మీడియాలో పోస్టు చేశాడు.
ఇలా చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సైకాలజిస్టులు అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా డోపమైన్ ఎఫెక్ట్ యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ఎక్కువ లైక్స్ వస్తే ఆనందం, తక్కువ స్పందన వస్తే నిరాశ… ఇలా మానసికంగా సోషల్ మీడియాపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాదు, ఇతర ఇన్ఫ్లూయెన్సర్ల లైఫ్ స్టైల్ చూసి తమ జీవితాన్ని పోల్చుకోవడం వల్ల కూడా యువతలో ఒత్తిడి పెరుగుతోం దని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారు..? ఎవరిని ఫాలో అవుతున్నారు..? ఎలాంటి వీడియోలు చేస్తున్నారన్న దానిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఫోన్ ఇవ్వడం కాకుండా, డిజిటల్ అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని చెబుతున్నారు.
నిండు ప్రాణాన్ని కాపాడాలని భావించి
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి టౌన్కు చెందిన రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో తాను ఆత్మహత్య చేసుకుంటు న్నానంటూ మంగళవారం భావోద్వేగంతో కూడిన వీడియో రూపొందించి పోస్టు చేశాడు. అయితే ఆత్మ హత్య చేసుకుంటానంటూ పోస్ట్ చేసిన వీడియో రోహిత్ అనుకున్నట్లుగానే వేగంగా వైరల్ అయ్యింది. ఈ విష యాన్ని గమనించిన కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ యువకుడి ఇంటికి వేగంగా వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని కాపా డాలని భావించారు. అదే వాయువేగంతో రోహిత్ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడే అసలు కథ విని కంగు తిన్నారు. తాను కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైక్ల కోసమే ఈ వీడియోను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసినట్లు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు. నిజంగా తాను ఆత్మ హత్య చేసుకోవడం లేదని తెలిపాడు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి విలువైన సమయాన్ని, వనరులను వృథా చేసినందుకు రోహిత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
