ఇకపై కాంప్లెక్స్ ఎరువులూ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే

రైతులకు ఫార్మర్ ఫర్టిలైజర్ యాప్‌పై అవగాహన కల్పించిన అధికారులు

పిట్లం, ఆంధ్రప్రభ: ఇకపై యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఆన్‌లైన్ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకుని కొనుగోలు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి వినోద్ రైతులకు సూచించారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫార్మర్ ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని, గురువారం నుంచి కామారెడ్డి జిల్లాలో ఈ విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు.

ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫార్మర్ ఫర్టిలైజర్ సిస్టమ్) అనేది ఎరువుల విక్రయాలు, నిల్వలు, డిమాండ్, సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ అని వివరించారు. రైతులు తాము ఎరువులు కొనుగోలు చేయాలనుకునే డీలర్‌ను యాప్‌లోనే ఎంపిక చేసుకుని బుకింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. బుకింగ్ గడువు రెండు రోజులుగా ఉంటుందని తెలిపారు.

ఇకపై ఏ రకమైన ఎరువులు కొనుగోలు చేయాలన్నా రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని సూచించారు.

గురువారం మండలంలోని కంబాపూర్ గ్రామంలో రైతులకు ఫార్మర్ ఫర్టిలైజర్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అదే విధంగా ఆయిల్ పామ్ సాగు ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి వినోద్, సర్పంచ్ సుజాత శ్రావణ్, ఏఈఓ ప్రదీప్‌రెడ్డి, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ హమీద్, రైతులు పాల్గొన్నారు.