హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ట్రావెల్ వీసాపై పాకిస్థాన్లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేసి, భారత దేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు రూపొందించే జ్యోతి, పాకిస్థాన్కు రహస్య సైనిక సమాచారం అందించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ అధికారి డానిష్తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని, పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఈ సమాచారాన్ని చేరవేసిందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయాన్ని హిసార్ పోలీసు ప్రతినిధి వికాస్ కుమార్ ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సబ్-ఇన్స్పెక్టర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.