irregularities|రీ సర్వేలో అక్రమాలకు తావివ్వద్దు..

  • జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్

irregularities|నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో రీ సర్వే సమస్యలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో రీ సర్వే సమస్యలపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2023- 24 సంవత్సరంలో జరిగిన రీ సర్వే కార్యక్రమంలో జిల్లెల గ్రామంలో కొంతమంది రైతులకు జాయింట్ ఎల్ పీ ఎంలు పడ్డాయని, భూమి కొలతలలో తేడాలు, ఒకరి భూమి మరొకరికి కేటాయించడం వంటి సమస్యలు వచ్చాయన్నారు.

ఈ సమస్యలన్ని ఆర్డీవోలు తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే పక్కాగా పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇందులో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలన్నారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆ దిశగా సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా తప్పులు లేకుండా పూర్తిచేయడానికి అధికారులు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులు పక్కాగా చేయకపోతే రెండవ సారి చేయాల్సి వస్తుందని రీ సర్వేకు సంబంధించిన ప్రతి పని జాగ్రత్తగా పరిశీలించి చేయాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జిల్లెల గ్రామంలోని రైతుల సర్వే సమస్యలను ఒక్కొక్క రైతుతో మాట్లాడి వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. జిల్లెల్ల గ్రామంలో రీ సర్వేలో ఎంత మంది రైతులకు భూ సమస్యలు వచ్చాయి అవన్నీ నివేదిక తయారు చేసి తమకు వెంటనే పంపాలని ఆర్డిఓ, తహసిల్దార్ కు సూచించారు. అనంతరం జేసి రీసర్వేపై అధికారులకు పలు అంశాల గురించి చర్చించి వారికి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు అధికారులు పాల్గొన్నారు.