ప్రజా సమస్యలపై సత్వర స్పందన..
ప్రజా సమస్యలపై సత్వర స్పందన..
ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కారం
అధికారులు సమన్వయంతో పనిచేయండి
జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 201 అర్జీలు
ఆంధ్రప్రభ విజయవాడ : ప్రజల సమస్యలపై సత్వరం స్పందించి… వీలైనంత త్వరగా నాణ్యతతో పరిష్కరించడం జరుగుతోందని.. ఇదేవిధంగా ముందడుగు వేస్తూ ప్రతిఅధికారి అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రజలకు సంతృప్తికర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ… జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులతో కలిసి సోమవారం ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
మొత్తం 201 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 56, పురపాలక శాఖకు సంబంధించి 31, పోలీస్ శాఖకు 29, పంచాయతీరాజ్ శాఖకు 17, డీఆర్డీఏకు 10 అర్జీలు వచ్చాయి. విద్యుత్కు 9, వైద్య ఆరోగ్యానికి 7, ప్రజారవాణాకు 6, ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్కు 5, కాలుష్య నియంత్రణకు 4, ఎండోమెంట్స్, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు మూడు చొప్పున, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, విద్య, ఉపాధికల్పన, గృహ నిర్మాణం, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి.
బీసీ సంక్షేమం, సహకార, డ్వామా, మత్స్య, జాతీయ రహదారులు విభాగాలకు ఒకటి చొప్పున వచ్చాయి. ఈ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సంతృప్తి స్థాయి బాగుండేలా అర్జీలను పరిష్కరించాలని.. ఈ విషయంలో జిల్లాస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజా వినతులపై స్పందన వేగవంతమైతేనే ప్రజలలో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
