సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈరోజు (శనివారం) రాత్రికి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉండగా, ఆ పర్యటన రద్దయింది. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ లేకపోవడంతో పర్యటన రద్దు అయినట్టు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో రేపు ఉదయం కె.సి. వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఫోన్ కాల్ జరుగుతుంది.
ఈ నెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో… కాంగ్రెస్ అధిష్టానం రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది.
కాగా, ఇప్పటికే పార్టీలో పలువురు సీనియర్ నేతలతో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ చర్చించారు. ఎవరెవరికి ఏ పదవులు కావాలో వారినే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.