- సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు..
- ఆలయ అధికారులకు అందరూ సహకరించాలి…
- దుర్గగుడి ఈవో వి కే శినా నాయక్
విజయవాడ, (ఆంధ్రప్రభ) : కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే విఐపి లందరూ నిర్దేశించిన సమయంలోనే ప్రోటోకాల్ దర్శనానికి రావాలని దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ శీనా నాయక్ సూచించారు. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వీఐపీల కోసం ప్రత్యేక టైమ్ స్లాట్ల లను కేటాయించినట్లు తెలిపారు.
ప్రతిరోజు ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో అమ్మవారికి మహా నైవేద్య సమర్పణ నిమిత్తం అంతకు ముందు ఆనవాయతీ ప్రకారం ఆలయ శుద్ధి కార్యక్రమం ఉన్నందున ప్రతిరోజూ ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు వి.ఐ.పి. దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.
దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున పార్కింగ్ సమస్య ఎదురవటం, నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు కొద్ది సమయం వేచి ఉండ వలసివస్తున్నందున ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు కాకుండా అంతకు ముందు, ఆ తరువాత సమయాలలో దర్శనానికి షెడ్యూల్ నిర్ణయించుకోవాలని సూచించారు.
ఈ సమయంలో రద్ధీ ఎక్కువగా ఉండుటవలన భక్తులు ఇబ్బంది పడకుండా, సకాలంలో శ్రీఅమ్మవారి దర్శనం త్వరితగతిన చేయించి సంతృప్తిగా వెళ్ళేందుకు గానూ ప్రతిరోజూ ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు వి.ఐ.పి. దర్శనాలు నిలుపుదలకు నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రతీరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 వరకు ఎప్పటి లాగనే 4 క్యూలైన్లద్వారా శ్రీఅమ్మవారి దర్శనం పరిపూర్ణంగా చేసుకొనవచ్చున్నారు. నైవేద్య విరామము, రద్ధీ సమయలు ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు వీలైనంత వరకు దర్శనానికి షెడ్యూల్ నిర్ణయించుకోవద్దని, వి.ఐ.పి.దర్శన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. సాధారణ భక్తుల సౌకర్యార్ధం ప్రతి ఒక్కరు దేవస్థానం అధికారులకు సహకరించాలని ఈఓ శినా నాయక్ విజ్ఞప్తి చేశారు.