జన్నారం, (ఆంధ్రప్రభ) : కవ్వాల టైగర్ రిజర్వ్లోని ఇందనపల్లి రేంజ్లోని భర్తరన్పేట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న రుబీనా తలత్ ను తన విధులను నిర్వర్తించకుండా ఆటంకపరిచి, ఆమెతో పాటు ఆమె భర్త అఫ్రోజుపై దాడి చేసిన కొందరు దుండగులను గురువారం అరెస్టు చేసి లక్షెట్టిపేట కోర్టులో హాజరుపరిచినట్లు స్థానిక ఎస్ఐ గుండేటి రాజవర్ధన్ తెలిపారు.
దాడికి పాల్పడిన వారిని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాలకు చెందిన ఎం.డి ఎజాజోద్దీన్, జన్నారంకు చెందిన ఎం.డి రియాజోద్దీన్ గా గుర్తించినట్టు రాజవర్ధన్ తెలిపారు.
రుబీనా ఫిర్యాదు మేరకు ఈనెల 7న కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఇద్దరు నిందితులను ఉదయం అరెస్ట్ చేసి లక్షెట్టిపేట జడ్జి ఎదుట హాజరు పరచగా, న్యాయస్థానం ఎజాజోద్దీన్, రియాజోద్దీన్ లకు 14 రోజులు రిమాండ్ విధించగా, అక్కడే ఉన్న జైలుకు తరలించినట్లు ఆయన చెప్పారు.