ఓ చిన్నారిని ఇంట్లో పందికొక్కులు కొరికి చంపిన దారుణ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గురవయ్య, దుర్గమ్మ దంపతులకు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు. ఎస్సీ కాలనీకి చెందిన ఆ దంపతులు కూలి పనులు చేస్తుంటారు.
ఈరోజు ఉదయాన్నే బాలుడిని ఉయ్యాలలో వేసి తల్లి దుర్గమ్మ టిఫిన్ కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో బాలుడు నిద్రపోతున్నాడు. తల్లి ఇంటికి వచ్చి చూడగా ఉయ్యాల వద్ద అలికిడి వినిపించింది. అక్కడ పందికొక్కులు కనిపించాయి. ఆమెను చూసి అవి పారిపోయాయి. ఆత్రుతతో ఉయ్యాలలో ఉన్న బిడ్డను చూడగా బాలుడి కాలు, మొఖంపై తీవ్రగాయాలు కనిపించాయి. ఆ బాలుడిని పందికొక్కులు కరిచాయని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రికి తరలించేలోపే బాలుడు మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు వేరే ప్రాంతం నుంచి వలస కూలీలుగా ఇక్కడికి వచ్చారని సమాచారం.