Kadiyam Kavya | హన్మకొండలో వందేమాతరం 150వ వార్షికోత్సవ ఉత్సవాలు

Kadiyam Kavya | హన్మకొండలో వందేమాతరం 150వ వార్షికోత్సవ ఉత్సవాలు
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
Kadiyam Kavya | వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : మహిళలు విద్యతో పాటు సామాజిక రాజకీయ రంగాల్లో మరింత ముందుకు రావాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ తదితర మహిళా నాయకుల సేవలను స్మరించుకుంటూ ప్రతి విద్యార్థిని రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలను స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు లభించిందని, ఈ గొప్ప అవకాశాన్ని దేశానికి అందించిన మహానుభావుడు డాక్టర్ బీఆర్. అంబేద్కర్ అని ఎంపీ కొనియాడారు. హనుమకొండలోని పింగళి మహిళ డిగ్రీ కళాశాలలో భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించిన వందేమాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సీబీసీ ఏర్పాటు చేసిన వందేమాతరం భారత రాజ్యాంగ చరిత్ర తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ చదువే పేదరిక నిర్మూలనకు ప్రధాన ఆయుధమని, సమాన హక్కులు అందించే శక్తి ఒక్క చదువుకే ఉందని స్పష్టం చేశారు. వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రజల్లో దేశభక్తిని రగిలించిన మహత్తర ప్రేరణగా నిలిచిందన్నారు. దేశ స్వాతంత్ర్య సాధన కోసం అనేక మంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. యువత దేశ చరిత్రను తెలుసుకొని, దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. భారతదేశం సర్వమత సమ్మేళనమని, మన దేశం సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమన్నారు. నేటి విద్యార్థులే భవిష్యత్ ఇండియా అని అన్నారు. ఎంపీ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు.

అలాగే సోషల్ మీడియ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, తమ భవిష్యత్ తమ చేతుల్లోనే ఉందని, చదువుపైనే పూర్తి నియంత్రణ ఉండాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవ వంటి అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనాలని, అప్పుడే దేశభక్తి, ఐక్యత, సమానత్వ విలువలతో కూడిన సమగ్ర ప్రతిభ వికసిస్తుందని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, అధ్యాపకులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


CLICK HERE TO READ కేసీఆర్ చేసిన అప్పులు.. భవిష్యత్తు పెట్టుబడులు.. !
