TG | హైదరాబాద్ వైద్యురాలి ప్రాణం తీసిన సరదా ఈత
- విహారయాత్రలో విషాదం
- తుంగభద్రలో యువ వైద్యురాలి మృతి
- 25 అడుగులపై నుంచి నీళ్లలోకి దూకిన వైద్యురాలు
హైదరాబాద్ – ఈత సరదా ఒక యువ మహిళా వైద్యురాలి ప్రాణం తీసింది.. పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన విహారయాత్ర చివరకు విషాదంగా మిగిలింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన 27ఏళ్ల యువ వైద్యురాలు అనన్య రావుకు ఈత అంటే సరదా. తన స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందకు ఆమె హంపీ టూర్కు వెళ్లారు.
అక్కడ పర్యాటక ప్రాంతాల్లో విహరించి.. మంగళవారం రాత్రి నణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బసచేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదికి వెళ్లారు. ఈత కొట్టడాన్ని ఇష్టపడే అనన్యరావు ఏకంగా 25అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకారు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ ఉద్ధృతిలో ఆమె కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వెంటనే గజ ఈతగాళ్లు నీళ్లలోకి దూకి.. ఆమె కోసం రాత్రి దాకా గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని హైదరాబాద్ కు పంపనున్నారు.