Steel Plant Accident | మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం
Steel Plant Accident | మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం
Steel Plant Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో రిటైర్మెంట్ వరకు నివసించే అవకాశం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుగుతోందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని కూడా పవన్ కళ్యాణ్ సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లు ఉన్నారు.




click here to read more : Police-Hunt : లారీ డ్రైవరు కిరాతకం Andhra Prabha Crime News
