Murder | సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య
సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. కుమార్తెను ప్రేమిస్తున్నాడని దశరథ్(26) అనే యువకుడిని ఆమె తండ్రి గోపాల్ దారుణంగా హతమార్చి నిప్పుపెట్టాడు. ఐదు రోజుల తర్వాత దశరథ్ మృతదేహం లభ్యమైంది.
ఏకంగా తన కుమార్తెతోనే దశరథ్కు కాల్ చేసి తండ్రి గోపాల్ ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. నా కూతురి జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్తో బాలిక తండ్రి తీవ్రవాగ్వాదానికి దిగాడు.అనంతరం ఆగ్రహంతో బండరాయితో మోదీ దశరథ్ని గోపాల్ హత్య చేశాడు
ఆ తర్వాత పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టె ప్రయత్నం చేసినట్లు తెలిసింది.మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలు ముక్కలుగా నరికి.. ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో అవయవాలను పడేసి బాలిక తండ్రి గోపాల్ ఇంటికి వచ్చేసాడు.
కాగా ఈ కేసులో నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గోపాల్తో కలిసి స్పాట్కు వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవలే సూర్యపేటలో ఘాతుకం
సూర్యాపేటలోనూ ఇటీవల ఓ పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(30)కు సూర్యాపేట పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్ అనే వ్యక్తి చెల్లెలు భార్గవితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. దీనిని తట్టుకోలేకపోయిన నవీన్.. సినిమా స్టైళ్లో ప్లాన్ వేసి.. కృష్ణను హతమార్చాడు. ఈ ఘటనను ఇంకా మరువకముందే సంగారెడ్డిలో ప్రేమ పేరుతో యువకుడ్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది