మనది రైతు మిత్ర విధానం
- రైతుకు నచ్చినచో అమ్ముతాడు
- ఇష్టం వచ్చిన మిల్లుకు తోలుతాడు
- గత ఏడాది సమస్యలు పునరావృతం కావొద్దు
- గన్నీ బ్యాగులు.. -టార్పాలిన్ లను సిద్ధం చేయండి
- రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ, ఆంధ్రప్రభ : రైతులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు సాగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) సూచించారు. విజయవాడలోని హోటల్ లో శనివారం మంత్రి అధ్యక్షతన అధికారులకు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ను ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలతో పరిష్కరించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా గన్ని బ్యాగులు, లేబర్, ట్రాన్స్పోర్ట్(Bags, Labor, Transport) వంటి సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గన్ని బ్యాగ్స్ సరఫరాలో దళారులను అరికట్టడానికి జాయింట్ కలెక్టర్లు చొరవ తీసుకోవాలని, దీనికి జిల్లా పోలీసు శాఖ నుంచి ప్రత్యేక ఎస్ ఓ పి విడుదల చేస్తామని తెలిపారు. పీడీ ఎస్ బియ్యం రీసైక్లింగ్కు వ్యతిరేకంగా రైస్ మిల్లర్లు ఇచ్చిన హామీని అమలు చేయాలని అధికారులను మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని అగ్రిమెంట్లలో స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించారు. ఎఫ్ సీ ఐ(FCI)కి 60 రోజుల్లో బియ్యం సరఫరా చేసే రైస్ మిల్లులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తామని, ప్రతి అంశం డాష్ బోర్డులో అందుబాటులో ఉంటుందని చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అధికారులు పిలుపునిచ్చారు. గత ఏడాది అకాల వర్షాల కారణంగా 30,000 టార్పాలిన్ లను పంపిణీ చేసినట్లు గుర్తు చేస్తూ, ఈసారి కూడా అవసరాన్ని బట్టి ముందస్తుగా టార్పాలిర్ లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో రైతులు ధాన్యం విక్రయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ(Farmer Friendly) విధానాల ద్వారా రైతులకు స్వేచ్ఛను కల్పించిందని అన్నారు.
రైతులు తమకు నచ్చిన మిల్లుకు, నచ్చిన సమయంలో ధాన్యం విక్రయించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. రైతులు సులభంగా వాట్సాప్(WhatsApp)లో హాయ్ పంపడం ద్వారా ధాన్యం విక్రయ ప్రక్రియలో చేరే సౌకర్యాన్ని కల్పించామని, విక్రయించిన 24 నుండి 48 గంటలలోపే రైతు ఖాతాల్లో నగదు జమ చేసిన విషయాలను గుర్తు చేశారు.
ఈ వర్క్షాప్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్(Saurabh Gaur), సివిల్ సప్లై కార్పొరేషన్ వి సి & ఎం డీ ఢిల్లీ రావు వ్యవసాయ శాఖ ఎండి మంజీర్ జిలాని, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్. గోవిందరావు, ఎఫ్ సి ఐ జి ఎం విజయ్ కుమార్ యాదవ్, ఆర్టిజెస్ సీఈఓ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై డీ ఎం(Civil Supply DM) లు, డీ ఎస్ ఓ లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

