ప్రజా సమస్యలే మా అజెండా

ప్రజా సమస్యలే మా అజెండా
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలు పరిష్కారం అజెండా తమ పార్టీ లక్ష్యమని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్(CPI ML Mass Line) ప్రజాపంథా కరీంనగర్(Karimnagar ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు గోదావరిఖనిలో జరిగిన మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలక పార్టీలు డబ్బు, కులం, మతం ఆధారంగా ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో మాస్ లైన్ ముందుకు సాగాలని, ఎన్నికల పోరులో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే తమ బలమని జూపాక శ్రీనివాస్(Jupaka Srinivas) అన్నారు.
అభ్యర్థులు, కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు. పదవుల వ్యామోహం కాకుండా ప్రజా సేవే మన ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజా పరిపాలన పూర్తిగా మందగించింది, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా పాలనలో ప్రజల భాగస్వామ్యం తగ్గిపోయిందన్నారు. మాస్ లైన్ పార్టీ ప్రజా ఉద్యమాల చరిత్రలో ఎల్లప్పుడూ ముందుండిందని, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి విశేషమైన మద్దతు ఉందని, ఈ ఎన్నికల్లో ఆ బలాన్ని మరింత పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీయే కారణం
హైకోర్టు ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై స్టే విధించడం దురదృష్టకరమని, దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని జూపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అడ్డుకునే విధానాన్ని బీజేపీ(BJP) అనుసరిస్తోందని, ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, సామాజిక న్యాయాన్ని కాపాడే ప్రతి శక్తి బీజేపీని గద్దె దింపే దిశగా కదలాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు ఆడపు శంకర్, కోడిపుంజుల లక్ష్మి, గొల్లపల్లి చంద్రయ్య, పుల్లూరి నాగభూషణం, ఈసంపల్లి రాజేందర్, పెండ్యాల రమేష్, మార్త రాములు తదితరులు పాల్గొన్నారు.
