కోల్కతా : పశ్చిమ బెంగాల్ (West Bengal) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్దవాన్ ప్రాంతంలో శుక్రవారం ఆగి ఉన్న లారీని భక్తులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోగా, మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆయా ఆస్పత్రులకు తరలించారు. మృతులను బీహార్ (Bihar) లోని చంపారన్ జిల్లాలోని మోతీహారీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 45 మంది యాత్రికులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన వారు తమ యాత్రను ప్రారంభించారు. మొదట జార్ఖండ్ (Jharkhand) లోని దేవ్గఢ్ను సందర్శించారు. అనంతరం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్ను సందర్శించారు. అక్కడ్నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బస్సు డ్రైవర్ ( Bus driver) నిద్ర మత్రులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.