AP | తాడిప‌త్రిలో హై టెన్ష‌న్ .. జెసి, కేతిరెడ్డి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ

తాడిప‌త్రి – అనంతపురం జిల్లా (Anantapuram District ) తాడిపత్రిలో (Tadipatri ) రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. వైసీపీ, టీడీపీ (TDP, YCP ) వర్గాల మధ్య ఘర్షణ (attacks )వాతావరణం నెలకొనడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(ketireddy peddareddy) రాకను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో, పోలీసులు (Police ) రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం తరలించారు.

ఈ ఉదయం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. విషయం తెలిసిన వెంటనే కేతిరెడ్డిని పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు ఆయన ఇంటి వైపు బయలుదేరారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి(jc prabhakar reddy) .. . అదే సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

దీంతో కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేతిరెడ్డి ఇంటి వైపు వెళ్తున్న టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తమ వాహనంలో ఎక్కించుకుని అనంతపురానికి తరలించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలకారణమని తెలుస్తోంది. తాను ఎన్నికల్లో గెలిచినా, ఓడిపోయినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజాన్ని కొనసాగిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వబోమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.

Leave a Reply