టోక్యోలో 9 మందిని చంపిన సైకో కిల్లర్
హతులలో 8 మంది మహిళలు, ఒక పురుషుడు
2020లోనే మరణశిక్ష ఖరారు
మహిళలపై అత్యాచారం చేసి ఆపై హత్య
వారు చావాలని కున్నారు… సాయం చేశానన్న దోషి
టోక్యో – జపాన్ను తీవ్రంగా భయపెట్టిన ‘ట్విట్టర్ కిల్లర్’ కేసులో( నిందితుడికి మరణశిక్ష అమలు చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని 9 మందిని దారుణంగా హత్య చేసిన తకహిరో షిరైషిని టోక్యో డిటెన్షన్ హౌస్లో శుక్రవారం నాడు ఉరితీసినట్లు జపాన్ అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ భయానక అధ్యాయానికి ముగింపు పలికినట్లయింది.
2017లో టోక్యోలోని షిరైషి అపార్ట్మెంట్లో ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలను పోలీసులు కనుగొనడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని షిరైషి లక్ష్యంగా చేసుకున్నాడు. ట్విట్టర్ ద్వారా వారిని సంప్రదించి, చనిపోవడానికి తాను సహాయం చేస్తానని నమ్మించి తన ఫ్లాట్కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. బాధితులైన ఎనిమిది మంది మహిళలపై షిరైషి లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత వారిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతుల్లో టీనేజర్లు కూడా ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యల పరంపరతో అతనికి ‘ట్విట్టర్ కిల్లర్’ అనే పేరు స్థిరపడింది.
ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం షిరైషిని దోషిగా తేల్చి 2020లోనే మరణశిక్ష విధించింది. అయితే, దేశంలో మరణశిక్షలను రద్దు చేయాలంటూ నిరసనలు జరగడంతో మూడేళ్లుగా జపాన్లో ఉరిశిక్షల అమలు నిలిచిపోయింది. తాజాగా ప్రభుత్వం ఈ శిక్షను అమలు చేయడంతో ‘ట్విట్టర్ కిల్లర్’ కథ ముగిసింది.