AP | కుటుంబహత్య కేసు.. అప్పలరాజుకు మరణశిక్ష !

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడను కుదిపేసిన ఆరుగురి దారుణ హత్య కేసులో దోషి అప్పలరాజుకు విశాఖపట్నం కోర్టు ఈరోజు (శుక్రవారం) మరణదండన విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 2021 ఏప్రిల్ 15న జరిగిన ఈ మారణహోమం స్థానిక ప్రజలను మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మానవ దురాగతానికి న్యాయ వ్యవస్థ స్పందించిన విశాఖపట్నం కోర్టు… ఈరోజు (శుక్రవారం) సంచలనాత్మక తీర్పును వెలువరించింది.

కేసు నేపథ్యం..

జుత్తాడ గ్రామంలో బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య గతంలో నుండి ఓ పాతవివాదం నడుస్తోంది. ఈ కక్షను కొనసాగిస్తూ నిందితుడు అప్పలరాజు, తన చేతిలో కత్తితో బొమ్మిడి కుటుంబంపై విచక్షణలేని మారణహోమం సృష్టించాడు. దాడిలో బొమ్మిడి రమణ (63), ఉషారాణి (35), అల్లూరి రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), చిన్నారులు బొమ్మిడి ఉదయ్ (2), ఉర్విష (6 నెలలు) మృతిచెందారు.

దాడి అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నేరస్థుడిపై బలమైన ఆధారాలు, దృఢమైన సాక్ష్యాలు కోర్టులో సమర్పించి, నేరాన్ని నిరూపించారు. ఈ క్రమంలో విచారణ పూర్తయిన తర్వాత న్యాయమూర్తి, నిందితుడి క్రూరత్వాన్ని పరిగణనలోకి తీసుకుని, అతనికి గరిష్ఠ శిక్షగా మరణదండన విధించారు.

Leave a Reply