లీడ్స్: ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత యువ బ్యాటింగ్ సంచలనం యశస్వీ జైస్వాల్ మైదానంలో మంటలు పుట్టించాడు. తొలిసారిగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టు బరిలోకి దిగిన జైస్వాల్, తనదైన శైలిలో అద్భుతమైన శతకాన్ని (100) సాధించి అభిమానుల మైమరిపించాడు. కేవలం 144 బంతుల్లో తన ఆరవ టెస్టు సెంచరీ సాధించిన జైస్వాల్, ఇది అతడి ఇంగ్లాండ్పై మూడో శతకం కావడం విశేషం.
అంతేకాదు, ఇంతకుముందు ఆస్ట్రేలియాలో తన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన జైస్వాల్, ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే ఫీట్ని రిపీట్ చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. వరుసగా విభిన్న దేశాల్లో తొలి ఇన్నింగ్స్లలో సెంచరీ చేసిన అరుదైన భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.
గిల్ కెప్టెన్సీ డెబ్యూట్.. స్టైల్లో హాఫ్ సెంచరీ!
ఇక మరోవైపు, తొలి సారిగా టెస్టు ఫార్మాట్లో భారత జట్టుకు నేతృత్వం వహిస్తున్న శుభ్మన్ గిల్ కూడా తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. కేవలం 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గిల్, కెప్టెన్సీకి అర్హతను బ్యాట్తోనే రుజువు చేశాడు.టెస్టుల్లో తన 8వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో ఇది ఇంగ్లాండ్పై నాలుగవది కావడం గమనార్హం.

శుభ్మన్ గిల్ టెస్టుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు (బంతుల పరంగా):
- 56 బంతులు vs ఇంగ్లాండ్, లీడ్స్, 2025 (ఈ రోజు)
- 60 బంతులు vs ఇంగ్లాండ్, విశాఖపట్నం, 2024
- 64 బంతులు vs ఇంగ్లాండ్, ధర్మశాల, 2024
భారత్ దూకుడు
ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (100) – గిల్ (58)** నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ కలిసి 155 బంతుల్లో 123 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. మ్యాచ్పై పూర్తి కంట్రోల్ భారత్ వైపే ఉంది.
ఈ మ్యాచ్ తో యువ భారత క్రికెట్ బలగం తన సత్తా నిరూపించుకుంటోంది. భారత యువ తారల మాయాజాలంతో టెస్ట్ ఫార్మాట్ లో కొత్త యుగం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.