- తొమ్మిది రోజుల టైమ్.. రైతు భరోసా డబ్బులేస్తాం
- రైతుల కోసం ప్రతి సంవత్సరం 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
- కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం
- టిఆర్ఎస్ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం గురించి పట్టించుకోలేదు
- రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్నదాతల అందరి ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు మొత్తం జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈరోజు (సోమవారం) రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
రైతు నేస్తం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బటన్ నొక్కగానే… రైతు ఖాతాల్లోకి టింగ్ టింగ్ మంటూ రైతు భరోసా నిధులు జమ అవుతాయని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. రాష్ట్రంలోని సాగు యోగ్యమైన, రైతన్నలు సాగు చేసుకుంటున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
ఎన్ని ఎకరాలు సాగు చేస్తే ఆ మొత్తం ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ అవుతాయి, ఎలాంటి లిమిట్ లేదు అన్నారు. రాష్ట్రంలో సాగులో ఉన్న 1.49 కోట్ల పైబడి ఎకరాలకు ఎకరాకు 12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయి అన్నారు.
భూమిలేని నిరుపేదలు వారు వ్యవసాయ కూలీలుగా ఉంటూ రైతుల పక్షాన నిలబడుతున్న పేదలకు కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 చొప్పున ప్రజా ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూపాయి, రూపాయి పోగుచేసి రైతులు, రాష్ట్ర ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు. రైతుల కోసం ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 70 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో మొత్తం 3.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒకటి తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతే ఇక మాకు పుట్టగతులు ఉండవని పదేళ్లు పాలించిన వారు ప్రజా ప్రభుత్వం పై బురదజల్లే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం రాష్ట్ర ప్రజలు గుర్తించాలి అన్నారు. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఈ ప్రభుత్వం నిటారుగా నిలబడింది అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అరచేతిలో పెట్టుకొని ఆశీర్వదించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తుంటే టిఆర్ఎస్ నేతలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు.. వారు దయ్యాలు అని ఆ పార్టీ నేతలే చెప్పారు, ఆ దయ్యాలు నేడు విక అట్టహాసం చేస్తున్నాయి, దయ్యాలు ఊర్లో ఉంటే అరిష్టం ఆ దయ్యాలను ఊరి పొలిమేరలోకి రానివ్వకుండా తరిమికొట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలి పంటలు పచ్చగా పండాలి రైతన్నలు ఆనందంగా ఉండేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది అని తెలిపారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు. రైతులు అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే రైతులు అని డిప్యూటీ సీఎం తెలిపారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు విడదీయరాని అనుబంధం ఉంది అని అన్నారు. ఉచిత కరెంటు, రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, మద్దతు ధరకు తో పాటు సన్నధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. ఎవరు ఊహించని విధంగా గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆపకుండా రైతు సోదరుల కోసం అనేక కొత్త పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు.
అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద 21 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసాం అన్నారు. ఇంతటి గొప్ప సాహసం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు అన్నారు. గత పాలకులు వెళ్లేముందు రైతు భరోసా వదిలేసి వెళ్లిపోతే క్యాబినెట్లో తీర్మానం చేసి రైతు భరోసా కింద 13,088 కోట్లు జమ చేసాం అన్నారు. సన్నధాన్యం సాగుచేసిన రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ కింద 1,199 కోట్లు విడుదల చేసాం అని తెలిపారు.
టిఆర్ఎస్ నేతలు రైతుల భీమా గురించి మర్చిపోయారు, ఆ రాడు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా పంట నష్టం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన పట్టించుకోలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడైనా పంట నష్టం జరిగితే లెక్క గట్టి రైతుల ఖాతాల్లో జమ చేశారు, కానీ 10 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ నేతలు ఆలోచన చేయలేదని డిప్యూటీ సీఎం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంట నష్టం కింద 260 కోట్లు విడుదల చేశాం, రైతుల ఇన్సూరెన్స్ కోసం 2,181 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు రాష్ట్రంలోని 29 లక్షల పంపుసెట్లకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరాకు 16,691 కోట్లు రైతుల పక్షాన ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ అధికారులకు చెల్లింపులు చేస్తుందని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 11 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.