హైదరాబాద్ | తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకలు నాంపల్లి గన్ పార్క్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా నిర్వహించనున్నారు.. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
రేపు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే అవతరణ దినోత్సవ వేడుకలకు స్పెషల్ గెస్ట్లుగా జపాన్ ప్రతినిధిబృందం హాజరవనుంది.ఈ నేపథ్యంలో జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం తో ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు పరేడ్ గ్రౌండ్స్లో ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు వేడుకలకు ఈ బృందం హాజరుకానుంది.
అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ, కితాక్యుషూ పరస్పర సహకార ఒప్పందం చేసుకుంటాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా హైదరాబాద్కు రావాలని మేయర్ను సీఎం ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితక్యూషూ.. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో సైతం కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కీలక ఎంవోయూలు చేసుకునే అవకాశం కన్పిస్తోంది.