TG | కిల్లర్ టైగర్ చిక్కింది.. బోనులో బంధించి చంద్రపూర్‌కు త‌ర‌లింపు..

  • ఫ‌లించిన రెస్క్యూ ఆపరేషన్
  • ఊపిరి పీల్చుకున్న ఆదివాసులు
  • పులి పిల్ల‌ల కోసం అన్వేష‌ణ‌


ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ సరిహద్దుల్లోని చంద్రపూర్ జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలోనే ఐదుగురిపై పంజా విసిరి పొట్టన పెట్టుకున్న కిల్లర్ టైగర్ ను ఎట్టకేలకు రెస్క్యూ టీం వలపన్ని పట్టుకుంది. చంద్రపూర్ అటవీ ప్రాంతంలో వరుస దాడులతో హడలెత్తిస్తూ అటవీ శివారు గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి జాడ కోసం ప్రత్యేక అటవీ సిబ్బంది గత మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించింది. చంద్రపూర్ జిల్లా డోంగర్ గావ్ అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలను పసిగట్టిన సిబ్బంది ప్రత్యేక బోను ఏర్పాటు చేసి మత్తు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ లేకుండా చేశారు. అనంతరం చంద్రపూర్ జిల్లా కేంద్రంలోని ప్రత్యేక సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు అటవీ క్షేత్రాధికారి విశాల్ సాల్కర్ తెలిపారు. ఈ పెద్దపులి తన పిల్లలతో కలిసి ముగ్గురు మహిళలపై దాడి చేసి హతమార్చినట్టు అధికారులు నిర్ధారించారు. పెద్దపులి పిల్లల జాడ కోసం గాలిస్తున్నామని తెలిపారు.

వరుస దాడులతో భయం భయం..
చంద్రపూర్ జిల్లా సరిహద్దుల్లో అడవికి వెళ్లిన‌ తునికాకు కూలీలపై పెద్దపులి దాడిచేసిన ఘటన సరిహద్దు అటవీ ప్రాంతంలో అలజడి రేపింది. పులుల అభయారణ్యంలోకి కూలీలు వెళ్లవద్దని తునికాకు సేకరణ కూడా నిలిపివేశామని అటవీ అధికారులు విధించారు. అయితే పెద్ద పులుల సంచారం పెరగడంతో ఆదివాసీ గిరిజన పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఫలించిన రెస్క్యూ ఆపరేషన్…
ఐదుగురు తునికాకు కూలీలను హతమార్చిన పెద్దపులి బోనులో చిక్కడంతో అటవీ అధికారులు రెస్క్యూ ఆప‌రేష‌న్ ఫ‌లించింది. దీంతో ఆదివాసీ కూలీలు, సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 10న చంద్రపూర్ జిల్లా సిందెవాహి తాలూకా మెండమాల గ్రామానికి చెందిన తునికాకు కూలీలపై పంజా విసిరి ముగ్గురు మహిళలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. చార్గావ్ అటవీ క్షేత్ర పరిధిలోని ఓ చెరువు సమీపంలో కొంత చౌదరి (65), శుభాంగి చౌదరి (28), రేఖాసిండే (51) అనే ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరుసటి రోజు 11న మూల్ తాలుకా నాగోడ గ్రామానికి చెందిన విమల షిండే (64) అనే మహిళపై దాడి చేసి పులి హతమార్చింది. వరుస దాడులతో హడలెత్తించిన మ్యాన్ ఈటర్ ను పట్టుకునేందుకు‌ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన మహారాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక బృందాలతో గాలిస్తూ పులి కదలికలు, పాదముద్రల ఆధారంగా బోనులు ఏర్పాటు చేయగా ఒక బోనులోకి దూరి పెద్దపులి చిక్కింది. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఇక మరో రెండు పెద్దపులి పిల్లల కోసం సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply