సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈరోజు (మంగళవారం) హయత్ నగర్ లోని డీఎస్పీ పార్థసారథి నివాసం, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
పార్థసారథి ఇంట్లో పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే, డీఎస్పీ పార్థసారథి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 25 లైవ్ బుల్లెట్లు, 65 ఉపయోగించిన బుల్లెట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఇంట్లో అక్రమంగా బుల్లెట్లు ఉండటంపై ఏసీబీ అధికారి మురళి హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హయత్నగర్ పోలీసులు డీఎస్పీ పార్థసారథిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పార్ధ సారధి ఇంట్లో దొరికిన బుల్లెట్లు ఎక్కడివి..? ఆయన ఇంట్లో ఎందుకు ఉన్నాయి..? యూజ్ చేసిన బుల్లెట్స్ ఎక్కడవి..? వాటిని ఎక్కడ ఉపయోగించారు..? అనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.