జీకే వీధి : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జీకే వీధి మండల పరిధిలోని చింతపల్లికి చెందిన దంపతులు ఇటీవల నిత్యం గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ అక్కతో ఎందుకు గొడవ పడుతున్నావని బావమరుదులు కిముడు కృష్ణ, కిముడు రాజు ఇద్దరు కలిసి బావ గెన్నును ప్రశ్నించారు. అయితే, మొదట వారి మధ్య సంభాషణ మాములుగానే సాగినా.. చివరకు తీవ్ర ఘర్షణకు దారి తీసింది.
దీంతో సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహానికి లోనైన గెన్ను ఇంటి సమీపంలో వేటకు వాడే శూలంతో కృష్ణ, రాజులను విచక్షణా రహితంగా పొడిచాడు. ఈ దుర్ఘటనలో తీవ్ర రక్తస్రావంతో వారిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.