లోకాయుక్తలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప లోకాయుక్త పి.రజిని
కర్నూలు, ఆగస్టు 15, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులోని లోకాయుక్త కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ సమైక్యత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థుల సమక్షంలో వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.
కార్యక్రమానికి హాజరైన ఉప లోకాయుక్త రజినీ తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం గావించారు. ఈసందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు.
జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసు సిబ్బంది, విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని ఉప లోకాయుక్త స్వీకరించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లోకాయుక్త కార్యాలయ సిబ్బంది, నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విన్నర్స్, రన్నర్స్కు బహుమతులు అందజేశారు. క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన పోటీతత్వం, సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈసందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం ప్రాధాన్యతను వివరిస్తూ దేశ అభివృద్ధి, ప్రజాసేవ, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పి.వెంకటరామరెడ్డి, రిజిస్ట్రార్ టి. వెంకటేశ్వరరెడ్డి, లోకాయుక్త కార్యాలయ అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
