త్వరలో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం..
- రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
- వరంగల్ ప్రాంత అభివృద్ధిలో మామునూరు ఎయిర్పోర్టు కీలకం
- ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 950 ఎకరాల భూమి అప్పగింత
- ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా చర్యలు
హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన 950 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి, ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించిందని వెల్లడించారు.
వరంగల్ ప్రాంత అభివృద్ధిలో మామునూరు విమానాశ్రయం కీలకంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి, పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. విమానాశ్రయాల అభివృద్ధితో ఆయా ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
