పాక్ వద్దులే… ట్రంప్ తెలివిడి.. మధ్యవర్తిత్వానికి అమెరికా కొత్త లెక్కలు

పాక్ వద్దులే… ట్రంప్ తెలివిడి.. మధ్యవర్తిత్వానికి అమెరికా కొత్త లెక్కలు

  • ఇరాన్ అంశంలో పాకిస్తాన్‌కు ట్రంప్ షాక్?
  • 10 బిలియన్ డాలర్ల డిమాండ్‌పై అమెరికా వెనుకడుగు
  • పాక్ ద్వంద్వ వైఖరిపై పెరుగుతున్న అనుమానాలు
  • సౌదీ, యూఏఈ వైపు అమెరికా మొగ్గు
  • ఉగ్రవాద ఆరోపణలు.. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి

ఇరాన్‌తో మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్తాన్ పది బిలియన్ డాలర్ల నిధులను డిమాండ్ చేసింది. దాంతో ఈసారి మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్తాన్‌ను వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసినట్టు సమాచారం. రెండు పర్యాయాలుగా పాకిస్తాన్ నెరిపిన మధ్యవర్తిత్వం వల్ల అమెరికా, ఇరాన్‌ల మధ్య దూరం తగ్గలేదు సరికదా, మరింత పెరిగింది. ఈ విషయాన్ని గ్రహించిన ట్రంప్ పాకిస్తాన్ గొంతెమ్మ కోర్కెలను తీర్చడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అయినా, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించమని కోరడమేమిటి? పాకిస్తాన్ వివాదాస్పద దేశంగా ముద్ర పడింది. శాంతియుతంగా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి బదులు భారత్‌తో చీటికీ మాటికీ తగవులు పెట్టుకోవడమే కాకుండా, భారత్‌లోకి ఉగ్రవాదులను పంపి అశాంతిని సృష్టిస్తోంది. పాకిస్తాన్‌లో పాలకులు ఎవరు ఉన్నా జరుగుతున్నది ఇదే. పాకిస్తాన్ ఇటు చైనాతోనూ, అటు అమెరికాతోనూ సామరస్యంగా ఉన్నట్టు వ్యవహరిస్తూ భారీ ఎత్తున సొమ్మును రాబట్టుకోవాలని చూస్తోంది.

ఇలా చేసినా పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం లేదు. పైగా, అప్పుల కోసం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల వద్దకు భిక్షాపాత్ర పుచ్చుకుని బయలుదేరుతోంది. ఈ విషయం కూడా ట్రంప్‌కు తెలుసు. అంతేకాక, ఉగ్రవాద మూకలకు ఆర్థిక సాయం అందిస్తూ దేశంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు కించిత్ ప్రయత్నం చేయడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సాయం అందించడం ద్వారా పబ్బం గడుపుకుంటున్నది.

పాకిస్తాన్‌ను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా యావత్ ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఇప్పుడు ఇరాన్‌తో తనకు గల సంబంధాలను ఆసరాగా చేసుకుని మధ్యవర్తిత్వ పాత్ర వహిస్తూ వనరులు సమీకరించుకోవాలని చూస్తోంది. సౌదీ అరేబియా నుంచి రుణం కోసం పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే, పరిమితికి మించి రుణం ఇచ్చేందుకు సౌదీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికాల మధ్య వైరాన్ని తగ్గిస్తామని చెప్పి మళ్లీ రంగంలోకి దిగాలనుకుంది.

అయితే, పాక్ డిమాండ్ల జాబితా చూసి అమెరికా వెనక్కి తగ్గింది. పాక్ కన్నా సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్‌లో ఏదో ఒక దేశం మధ్యవర్తి పాత్ర వహిస్తే మంచిదని ట్రంప్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి వెలువడే పత్రికలు కూడా ఇందుకు సుముఖం ఉన్నాయి. ఇరాన్ పార్లమెంటు స్పీకర్‌నీ, విదేశాంగ మంత్రిని పాక్ ఆహ్వానించినప్పటికీ, వారు సుముఖంగా లేరని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలే ఇందుకు కారణం.

అమెరికాతో ద్వైపాక్షిక ఆర్థిక స్థిరీకరణ సదుపాయం ప్రకారం పది బిలియన్ డాలర్ల సాయాన్ని అందించాలని పాకిస్తాన్ కోరింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం కోసం పాకిస్తాన్ ఇంతే మొత్తాన్ని కోరి విఫలమైన సంగతి అమెరికాకు తెలుసు. ఈ విషయాన్ని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ తెలియ చేశారు. అమెరికా ఆయుధాలపై చేస్తున్న వ్యయం చాలా ఎక్కువగా ఉన్నందున ఈ తరుణంలో పాక్ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించడం సాధ్యం కాదని బిసెంట్ స్పష్టం చేసినట్టు తెలియవచ్చింది.